
రెవెన్యూ శాఖ అర్జీలే అధికం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర– 2047 లక్ష్యాల సాధనకు, సమాజ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సంపద సృష్టి, వృద్ధిరేటుపై ప్రతి శాఖ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. డీఆర్వో లక్ష్మీనరసింహతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ లక్ష్మీశ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల పదో తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర విజన్ : 2047, వృద్ధి ఇంజిన్లపై జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులకు వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు.
అర్జీలు ఇలా..
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 152 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 76 అర్జీలు వచ్చాయి. శాఖల వారీగా.. పోలీస్ శాఖకు 16, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు పది చొప్పున, పంచాయతీ రాజ్కు ఆరు, గృహ నిర్మాణానికి ఐదు, డీఆర్డీఏ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, విద్యా శాఖలకు నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. ఉపాధి కల్పన, మార్కెటింగ్, ఏపీసీపీడీసీఎల్, వ్యవసాయం, సహకార సొసైటీ, కార్మిక, సర్వే, ఎండోమెంట్, వైద్య ఆరోగ్యం, నైపు ణ్యాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఏపీ జెన్కో, ఫుడ్ కంట్రోల్, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరే షన్, బ్యాంకింగ్, సీఆర్డీఏ విభాగాల పరిధిలో మిగిలిన అర్జీలు అందాయి.
దారి మూసివేశారు
‘చందర్లపాడు మండలం, ముప్పాళ్లలో మెయిన్ రోడ్డు నుంచి దళితవాడ వరకు వెళ్లేందుకు రోడ్డు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నాం. గతేడాది ఈ రోడ్డును సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ఈ రోడ్డులో మొదట ఓసీలు, ఆ తర్వాత 30కు పైగా ఎస్సీల ఇళ్లు ఉన్నాయి. ఓసీల ఇళ్ల వరకు ఒక భాగం, అక్కడ నుంచి దళితుల ఇళ్ల వరకు మరో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రెండు భాగాల మధ్యలో కొంత రోడ్డు వేయండా వదిలేశారు. రోడ్డు నిర్మించకుండా వదిలేసిన చోట కొందరు ఇనుప కంచె వేసి రోడ్డును మూసివేశారు. దీంతో మాతో పాటు దళిత కుటుంబాలకు దారి సమస్య ఏర్పడింది’ అని ములకలపల్లి లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు అర్జీ సమర్పించారు.
మా భూమికి హద్దులు నిర్ణయించండి
‘నందిగామ అశోక్నగర్లో మాకు ఆర్ఎస్ నం. 476/1, 477/1 నంబర్లలో 2.14 ఎకరాల భూమి ఉంది. సబ్ డివిజన్లో 1.82 ఎకరాలుగా రిజిస్టరైంది. మా స్థలానికి ఉత్తరం వైపు ప్రభుత్వ డొంక ఉంది. కొందరు డొంకతో పాటు మా స్థలాన్ని ఆక్రమించి భవనాలు నిర్మించారు. మా స్థలాన్ని ఆనుకుని మరు గుదొడ్లు నిర్మించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సర్వే చేసి మా స్థలానికి హద్దులు నిర్ణయించండి’ అని బైసాని వెంకట నాగేశ్వరరావు అర్జీ సమర్పించారు.
పీజీఆర్ఎస్కు 152 అర్జీలు అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశాలు