నాగులచవితికి సిద్ధం
మోపిదేవి: రాష్ట్రంలో ఎంతో ప్రాశస్త్యమున్న శైవ పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఒకటి. కార్తిక మాసంలో నాగులచవితికి పుట్టలోపాలు పోసినవారికి మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతో రాష్ట్ర నలుమూలల నుంచి మంగళవారం వేలాదిగా భక్తులు మోపిదేవికి తరలి రానున్నారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు చల్లపల్లి ఎస్టేట్ ఆలయాల డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం సాయంత్రం వెల్లడించారు. క్యూలైన్లు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ తెల్లవారుజామున 2.30 గంటల తర్వాత నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. పోలీస్ బందోబస్తు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు సూచించిన ప్రదేశంలోనే పార్కింగ్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. దేవస్థానం పక్కన జెడ్పీ పాఠశాల ఆవరణలో భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆలయం లోపల ముద్దబంతి పూలతోనూ, వెలుపల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
నేడు నాగులచవితి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో వసతుల ఏర్పాటు పూలు, విద్యుత్ దీపాలతో ఆలయం ముస్తాబు


