
మారథాన్ను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎన్. ఢిల్లీరావు సూచించారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం 5కే, 3కే యూత్ ఫెస్ట్ మారథాన్ రన్ నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద కలెక్టర్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిపై యువతలో అవగాహన పెంచాలన్నారు. 17 నుంచి 25 ఏళ్ల యువత ఎయిడ్స్ బారిన పడటం దురదృష్టకరమన్నారు. వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఎయిడ్స్కు అత్యాధునిక వైద్యం, మందులు అందుబాటులోకి రావడంతో బాధితులు ఆరోగ్యంగా జీవిస్తున్నారని వివరించారు. కళాశాలల స్థాయిలో విద్యార్థులు అనుసరించాల్సిన జీవనశైలి, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మీసాల రాజారావు వంతెన సిగ్నల్ పాయింట్ వద్ద ప్రారంభమైన 5కే రన్ గూలాబీ తోట జంక్షన్ మీదగా తిరిగి మీసాల రాజారావు బ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. ఈ ర్యాలీలో నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మారథాన్ విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ ఢిల్లీరావు అందజేశారు. 5కే రన్లో ప్రథమ బహుమతి పొందిన పైడిరాజుకు రూ.5 వేలు, ద్వితీయ బహుమతిగా జి.తరుణ్కు రూ.3 వేలు, తృతీయ బహుమతిగా ఎస్కే బాజీకి రూ.2,500, తేజామ్, సాయిమనోజ్కు ప్రోత్సాహక బహుమతులుగా రూ.1000 చొప్పున అందజే శారు. 3కే రన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా బి.కరుణశ్రీ, వి.హన్నా, ఆర్.రమ్య గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ కంట్రోలింగ్ ఆఫీసర్ డాక్టర్ జి.ఉషారాణి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ యుగంధర్, జిల్లా స్పోర్ట్స్ చీఫ్ కోచ్ అజీజ్, ఎయిడ్స్ ప్రోగ్రాం జిల్లా మేనేజర్ పి.కిరణ్, సూపర్వైజర్ ప్రశాంతి చౌదరి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు