డొంకేశ్వర్: అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన చిన్నాయానం గ్రామానికి చెందిన బొమ్మ నరేశ్కు చికిత్స కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రూ.10 లక్షల ఎల్వోసీ అందజేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు తొండాకూర్ ముత్యం ఆధ్వర్యంలో చెక్కును బాధిత కుటుంబానికి ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అండగా నిలుస్తున్నార ని ఆయన కొనిడాయారు. బీజేపీ మండల అధ్యక్షు డు చిన్నారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
వేల్పూర్: చేయూత పింఛన్కు సోమవారం ఆఖరు తేదీ ఉన్నందున వేల్పూర్లో అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సర్పంచ్ మొండి అశోక్ తెలిపారు. వేల్పూర్లో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే జీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బోధన్ టౌన్(బోధన్): బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ వెంకటనారాయణ ఆదివారం తెలిపారు. పట్టణంలోని శక్కర్నగర్ చౌరస్తాలో ఈనెల 21న భిక్షాటన చేసే గుర్తుతెలియని వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండగా, పోలీసులు గమనించి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని, మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, వయస్సు సుమారు యాభై ఏళ్ల వరకు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59778, 87126 50870 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.
● దంపతులకు గాయాలు
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొనడంతో దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కుకునూర్ సాయిరెడ్డి, సంధ్య దంపతులు ఆదివారం బైక్పై పెర్కిట్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పెళ్లికి బయలుదేరారు. హైవే సర్కిల్ చౌరస్తా వద్ద వారి బైక్ను హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆర్మూర్ లోని ఆస్పత్రికి తరలించారు. కాగా సాయిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. లారీని సీజ్ చేసినట్లు కేసు నమోదు చేసి పోలీసులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.


