● పరస్పర ఫిర్యాదులు.. ఆరోపణలు
● ఇప్పటికే ఓ సారి రద్దయిన ప్రక్రియ
● నేడు ‘సర్కిల్’ పరిధిలో నిర్వహణ
నిజామాబాద్అర్బన్: పోలీస్సంఘం ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. పరస్పర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈనెల 27న జరగాల్సిన ఎన్నికలు అనూహ్యంగా వాయిదాపడ్డాయి. పోలీస్ సంఘం అధ్యక్ష పదవికి మొత్తం నలుగురు పోటీ పడగా.. సతీశ్ (పీసీ) ప్రస్తుతం పోలీసుశాఖలో కాకుండా డిప్యుటేషన్పై విద్యుత్ సంస్థ (ట్రాన్స్కో)లో పని చేస్తున్నారని, ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హుడని పేర్కొంటూ మరో అధ్యక్ష అభ్యర్థి సురేశ్ అభ్యంతరం తెలిపారు. దీంతో సతీశ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు స్కృటినిలో తొలగించారు. అయితే అనూహ్యంగా సురేశ్ను జగిత్యాల జిల్లాకు బదిలీ చేశారు. గతంలోనే సురేశ్ను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తయ్యిందని పోలీసు అధికారులు పేర్కొనడం గమనార్హం. అయితే అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థిని ఎలా బదిలీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో సంఘం అధ్యక్ష ఎన్నికల్లో గంగదరగోళం మొదలైంది. చివరకు సీపీ ఎన్నికలను రద్దు చేశారు.
అయితే ఎప్పుడో వచ్చిన ఆర్డర్ కాపీని అడ్డుగా పెట్టుకొని తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సురేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
జిల్లాలో 25 సర్కిల్ స్టేషన్లు ఉండగా.. సోమవారం సర్కిల్ స్థాయిలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సుమారు 2వేల మంది వరకు సిబ్బంది, అధికారులు ఆయా సర్కిల్లలో ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. సర్కిల్ స్థాయి ఎన్నిక ప్రక్రియ ముగిసిన తరువాత అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.


