ఇదేం పని..!?
రోడ్డు విస్తరిస్తున్నారని ఆనంద పడాలో.. ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను చూసి భయపడాలో తెలియని పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా నుంచి నాగారం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. అయితే విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే పనులు చేపట్టడం గమనార్హం. రాత్రి వేళల్లో ప్రతిరోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
డిచ్పల్లి: ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలనే వాడి అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) వీరాస్వామి రైతులకు సూచించారు. మండలంలోని నడిపల్లి రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాను రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి తన సందేశాన్ని వినిపించారు. అనంతరం డీఏవో మాట్లాడుతూ.. మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
పంటల సాగులో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. రూరల్ ఏడీఏ కృష్ణ, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, టీఎస్ సీడ్ ఆర్ఎం వినయ్, నడిపల్లి సర్పంచ్ కులాచారి అశ్వినిసతీశ్కుమార్, సర్పంచ్లు సూదం శ్రీనివాస్, శాంతిలాల్, సొసైటీ సీఈ వో సాయిచంద్, సాయిలు, ఏఈవో లక్ష్మీప్రసన్న, సతీశ్, బూస సుదర్శన్, అశోక్, లక్ష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


