డిచ్పల్లి: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ పి సత్యనారాయణ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సురక్షిత రవాణాపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ‘రోడ్డు భద్రత అవగాహన– ట్రాఫిక్ భద్రత ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. అధికారులు, పోలీసు సిబ్బంది రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ వినియోగించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం బెటాలియన్ అధికారులు, పోలీసు సిబ్బంది అందరూ ట్రాఫిక్ భద్రత ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించడంతోపాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజల్లో కూడా అవగాహన కల్పించి సురక్షిత తెలంగాణ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. బెటాలియన్కు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


