రెంజల్(బోధన్): వానాకాలం సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు వేదిక, వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం రెంజల్ తహసీల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రావణ్కుమార్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధులు పుట్టి నాగన్న, గుమ్ముల గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధి పార్వతి రాజేశ్వర్లు మాట్లాడుతు విత్తనాల ఎంపిక, ఎరువుల సరఫరాతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. యూరియాను ఎకరాకు కనీసం 4 బస్తాలను అందించాలన్నారు. ఏడు రకాల సన్నాలకే కొనుగోలు చేస్తామని నిబంధనలను పెట్టడం సరికాదన్నారు. మండల ప్రతినిధులు పెద్దులు, పొశెట్టి, గంగాధర్, సిద్ద పొశెట్టి, రవి, సాయిలు, మైసయ్య, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.


