● ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్అర్బన్ : జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, నకిలీ విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని ప్రభు త్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సోమవారం వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు సమీక్ష నిర్వహించారు. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను వివరించారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయాలని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేయాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూ చించారు. లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. మంచినీటి ట్యాంకులను శు భ్రం చేయిస్తూ, క్లోరినేషన్ జరిపించాలని సూచించారు. పట్టణాల్లోని డ్రెయినేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలన్నారు. ఇళ్ల మధ్య ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొ లగించి, సురక్షిత ప్రదేశాల్లోకి మార్చాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, నిజామాబాద్ను గుడిసెలు లేని జిల్లా గా తీర్చిదిద్దాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


