● నిర్ణీత సమయం తర్వాత
కేంద్రాల్లోకి అనుమతి లేదు
● ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్ అర్బన్: నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరగనున్న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నీట్ పరీక్ష పున:నిర్వహణ ఏర్పాట్లపై శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీ క్ష జరిపారు. జిల్లాలో 3456 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాగారంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల/కళాశాల, బోధన్ పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్న్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్న్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల బిల్డింగ్, మాక్లూర్ లోని శ్రీ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అను మతిస్తారన్నారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలన్నారు. ఎల క్ట్రానిక్ ఉపకారణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవన్నారు. నీట్ పరీక్ష రో జున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నందు న విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని అదనపు డీసీపీ శుభం నగ్రాలేకు సూచించారు. సమావేశంలో పరీక్షా కేంద్రాల నోడల్ ఆఫీసర్లు, అధికారులు పాల్గొన్నారు.


