● పూలదండలు మార్చుకొని
స్వీట్లు పంచిన దంపతులు
అశోక్, గంగామణిలకు పెళ్లి రోజు
వేడుకలు నిర్వహిస్తున్న తోటి కూలీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో శనివారం ఉపాధిహామీ పనులు జరుగుతున్న చోట ఓ వినూత్న వేడుక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలు కొండమడుగు అశోక్, గంగామణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవాన్ని తోటి కూలీలందరూ కలిసి పని స్థలంలోనే ఘనంగా నిర్వహించారు. పని విరామ సమయంలో కూలీలంతా ఒక్కటై అశోక్–గంగామణి దంపతులను ప్ర త్యేకంగా వధువు, వరుడిలాగా నిలబెట్టి వారి చేత పూల దండలు మార్పించారు. ఒకరికొక రు స్వీట్లు తినిపించుకునేలా చేశారు. కూలీలందరూ అక్షింతలు చల్లి దందపతులను ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు, చప్పట్లతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. నిత్యం పారలు, గంపలతో చెమటోడ్చే కూలీలు... ఇలా తోటి కూలీల పెళ్లిరోజు వేడుకను సంబరంగా నిర్వహించడం స్థానికంగా విశేషంగా ఆకట్టుకుంది.


