రుద్రూర్: ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి సూచించారు. ప్రత్యేక ఇంటింటి సర్వే కార్యక్రమంపై బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లకు శనివారం పోతంగల్, రుద్రూర్ మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బీఎల్వోలు, బీఎల్ఏలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి సర్వే విధానంపై అధికారులు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సందీప్, తారాబాయి, కోటగిరి డీటీ మధు, ఎంఆర్ఐలు విజయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు అన్యాయం జరగొద్దు
వర్ని: ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఎల్వోలు, అధికారులకు సూచించారు.
వర్ని మండల కేంద్రంలో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా సర్ ప్రోగ్రాంను నిర్వహించాలన్నారు. అనర్హులను జాబితా నుంచి తొలగిస్తూ అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. బాన్సువాడ ఆర్డీవో రవీందర్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, తహసీల్దార్ ప్రశాంత్, వర్ని సొసైటీ చైర్మన్ సాయిబాబా పాల్గొన్నారు.


