ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఏప్రిల్/మే–2026లో నిర్వహించిన యూజీ బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ 2వ, 4వతోపాటు 6వ సెమిస్టర్ల (రెగ్యులర్), 1వ, 3వ, 5వ (బ్యాక్లాగ్) సెమిస్టర్ (2025–26) పరీక్షా ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాంమోహన్ రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి కే భరత్ రాజ్, కళాశాల అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు కే వినయ్ కుమార్, డాక్టర్ యస్ జయప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. https:// gdctg. cgg. gov. in/ nizamabad. edu లో ఫలితాలను చూసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆరో సెమిస్టర్లో 82.27 శాతం, నాలుగవ సెమిస్టర్ లో 50.17 శాతం, ఫస్ట్ ఇయర్ లో 47.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శుక్రవారం ఆదర్శనగర్లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాల ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి , అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, బాల్రాజు, శ్యాంసన్, ధర్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గడుగు గంగాధర్ను అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సైతం పరామర్శించారు.
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పోలీస్స్టేషన్ పరిధి వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న మదర్సా నుంచి 11 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. డిచ్పల్లికి చెందిన బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గుర్జాల్లో వృద్ధుడు..
గాంధారి : మండలంలోని గుర్జాల్కు చెందిన మంగళారం పోశయ్య(60) అదృశ్యమైనట్లు ఎస్సై మహేందర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 16 న ఇంటి నుంచి వెళ్లిన పోశయ్య తిరిగిరాలేదు. కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


