ప్రభుత్వ బడివైపు అడుగులు..
పన్ను చెల్లిస్తామని కోనాపూర్ జీపీ నిర్ణయం
● తన పిల్లలను చేర్పించిన బెజ్జోర సర్పంచ్
ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను
చేర్పిస్తున్న సర్పంచ్ కార్తీక్
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు పేద, మధ్య తరగతిపై చదువుల కోసం ఆర్థికభారం పడకుండా ప్రజాప్రతినిధులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందుకోసం తామే ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించగా, తాజాగా భీమ్గల్ మండలం బెజ్జోర సర్పంచ్ కార్తీక్ తన కూతురు అక్షరవింద, కొడుకు శ్రీమాన్ రుద్రను నాల్గో తరగతిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారని, దీనిని దృష్టిలో ఉంచుకొనే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని సర్పంచ్ అన్నారు. సర్పంచ్ నిర్ణయంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. – కమ్మర్పల్లి(భీమ్గల్)
ఆటలు ఆడిస్తూ అక్షరాలు నేర్పిస్తే.. పాటలు పాడుతూ అంకెలు వల్లె వేయిస్తే.. బడికి వెళ్లనని మారాం చేసే చిన్నారులు ఉంటారా? పిల్లల శారీరక, మానసిక వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలలు దోహదం చేయనున్నాయి. జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామంలోని ప్రీ ప్రైమరీ పాఠశాల ఇది. ప్రైవేట్కు దీటుగా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న పాఠశాలలకు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వస్తున్నా రు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాల కొనసాగుతోందని ఇన్స్ట్రక్టర్ తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంతోపాటు అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉండడంతో పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారని హెచ్ఎం కిషన్ తెలిపారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే వారి ఇంటి పన్ను (2026–27)ను గ్రామ పంచాయతీ నుంచి చెల్లించాలని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ జీపీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ రిక్క అరుణ్కుమార్ అధ్యక్షతన గురువారం సమావేశమైన పాలకవర్గ సభ్యులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు తీసుకున్న నిర్ణయంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


