● ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన
నిరుద్యోగ అభ్యర్థులు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని కోరుతూ.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి పలువురు నిరుద్యోగ అభ్యర్థులు విన్నవించారు. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడేలా చూడాలని తద్వారా అనేకమంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రూప్స్, డీఎస్సీ తదితర విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు జారీ అయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని అందుకు నిదర్శనమే ఇప్పటి వరకు దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.


