నిజామాబాద్ రూరల్ : కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డీఆర్ఎం జ్యోతిని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ కార్యదర్శి సాయిలు, రాష్ట్ర నాయకులు వీడీ దాస్, సంజీవ్, నాయకులు మల్లయ్య, ఎంజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి: జిల్లాలో ఫిట్నెస్లేని ప్రయివేటు స్కూల్ బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. నాగారంలోని డీటీవో రమేశ్ రాథోడ్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 840 పైగా ప్రయివేటు విద్యాసంస్థల బస్సులు ఉన్నాయని, అందులో 150పైగా బస్సులు ఫిట్నెస్ రెన్యువల్ చేయించకుండా నడుపుతున్నారని తెలిపారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్, నాయకులు భవానీ, శ్రీకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.


