మోర్తాడ్(బాల్కొండ): ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణకు భూ సేకరణనే ప్రధాన సమస్యగా నిలిచింది. వ్యవసాయ భూములకు తీవ్ర ముప్పు వాటిల్లనుండటంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు రెండు లేన్ల రోడ్డుగా ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణను త్వరిత గతిన చేపట్టడానికి ఎన్హెచ్ఏఐ రెవెన్యూ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. మొదట్లో ఉన్న జాతీయ రహదారిని విస్తరించాలని నిర్ణయించగా కొన్ని గ్రామాల్లో ఇండ్లు, భవనాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని భావించారు. దీంతో ఇండ్లు, భవనాలకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి బైపాస్ రోడ్లను నిర్మించాలని కొత్తగా ప్రతిపాదించారు. గతంలో జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించిన సమయంలో జిల్లాలో 26 కిలోమీటర్ల రోడ్డుకు 72.2671 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పుడు చేసిన కొత్త ప్రతిపాదనలతో బైపాస్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించగా 83.895 హెక్టార్ల భూమిని సేకరించాల్సిన అవసరం ఏర్పడింది.


