● సర్వే నిర్వహించిన రెవెన్యూ,
మైనింగ్, ల్యాండ్ సర్వే అధికారులు
బోధన్: మన సరిహద్దుల్లోని మంజీర నదిలోకి చొ చ్చుకొచ్చి మహారాష్ట్ర కాంట్రార్లు ఇసుక తవ్వకాలు జరపడంతో అధికారులు తాజాగా సర్వే నిర్వహించారు. సాలూర మండల తహసీల్దార్ అజ్మీత్ నవా జ్, ల్యాండ్ సర్వే శాఖ డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ దత్తాత్రిలతో పాటు రెవెన్యూ, మైనింగ్, ల్యాండ్ సర్వే శాఖల అఽధికారులు సర్వేలో పాల్గొ న్నారు. మ హారాష్ట్రలోని గంజ్గాం, బోలేగాం గ్రామాల శివారు లో ఆ ప్రాంత ఇసుక కాంట్రాక్టర్లు మంజీర నదిలో రెండు నెలలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ రెండు ఇసుక క్వారీలు సాలూర మండలంలోని హున్సా– మందర్నా, తగ్గేల్లి గ్రామాల అవతలి వైపు ఉన్నాయి. రెండు చోట్ల మహారాష్ట్ర కాంట్రాక్టర్లు మన హద్దుల్లోని మంజీర నదిలోకి చొచ్చుకు వచ్చి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారని ఆ గ్రామాల ప్రజలు అధికారులకు సమా చారం అందించారు. మే మొదటి వారంలో తగ్గేల్లి శివారులో మన అధికారులు హద్దులు గుర్తించి ఎర్ర జెండాలు పాతి వచ్చారు. తాజాగా హున్సా– మందర్నా శివారులో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. హద్దులు దాటి తవ్వకాలు చేసినట్లు గుర్తించారు.
పటిష్ట చర్యలు తీసుకుంటాం..
సాలూర మండలంలోని హున్సా– మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలో సర్వే నిర్వహించాం. మన హద్దుల్లోకి వచ్చి మహారాష్ట్ర కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు సర్వేలో ప్రాథమికంగా అంచనా వేశాం. జాయింట్ సర్వేకు మహారాష్ట్ర అధికారులకు పలుమార్లు విన్నవించినా సహకరిండంలేదు. ల్యాండ్ సర్వేయర్ల రిపోర్టు వచ్చిన తర్వా త మన హద్దులో ఇసుక తవ్వకాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటాం. – అజ్మీత్ నవాజ్,
తహసీల్దార్, సాలూర మండలం


