బోధన్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా బోధ న్లో 1,519 రోజుల పాటు రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. ఈ ఉద్యమ దీక్షలతో రాష్ట్ర స్థాయి లో బోధన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2009 డిసెంబర్ 9న అప్పట్లో అధికారంలో ఉన్న యు పీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించి యూటర్న్ తీసుకున్న క్రమంలో ఉద్యమం మరింత వేడెక్కింది. బోధన్ ప్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, మహిళా, కార్మిక , విశ్రాంత ఉద్యోగులు, రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ జేఏసీని ఏర్పాటు చేశారు. 2009 డిసెంబర్ 28న పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఐదుగురు ఉద్యమ కారులతో రిలే నిరహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. 2014 ఫిబ్రవరి 23 వరకు అలుపెరుగకుండా రిలే నిరహార దీక్షలు కొనసాగించారు.
ఉద్యమ సారథి కేసీఆర్తో పాటు టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు దీక్షలను సందర్శించారు. బోధన్లోని అంబేడ్కర్ చౌరస్తాలో పట్టణ కుల సంఘాల జేఏసీ అధ్వర్యంలో తెలంగాణ అ మరవీరుల స్తూపం నిర్మించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు అక్కపల్లి కొండయ్య కుటుంబీకులు స్తూప నిర్మాణానికి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. 2013 ఏప్రిల్ 29న ప్రజాగాయకుడు గద్దర్ స్తూపాన్ని ఆవిష్కరించారు.


