● తల్లి, కుమారుడికి తీవ్రగాయాలు
ఆర్మూర్టౌన్: గ్యాస్ లీకేజీతో మంటలు అంటుకొని ఇద్దరికి గాయాలైన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కాశీ హనుమాన్ సమీపంలో కొండూర్ రాజేశ్ చికెన్ షాప్తోపాటు కిరాణాషాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం చికెన్ను స్టౌవ్పై కాల్చుతుండగా సిలిండర్ పైప్ నుంచి గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో మంటలు చెలరేగి దుకాణం మొత్తం వ్యాపించాయి. కిరాణ దుకాణంలో ఉన్న తల్లి కొండూరు రుకుంబాయికి, రాజేశ్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆర్మూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదంలో సుమారు రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.


