● ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యత్వానికి రవిగౌడ్ రాజీనామా
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ వలస కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించడానికి ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యుడైన గుగ్గిల్ల రవిగౌడ్ రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. గల్ఫ్ జేఏసీ చైర్మన్గా వలస కార్మికుల పక్షాన ఉద్యమాలను కొనసాగించిన రవిగౌడ్ను గత ఏడాది ఏప్రిల్లో ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డులో సభ్యునిగా ఎంపిక చేశారు. కమిటీ ఏర్పాటు చేసి 14 నెలలు దాటినా ఎలాంటి కార్యాచరణ ముందుకు సాగక పోవడంతో ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ శనివారం సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ వినోద్కుమార్కు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. రవిగౌడ్ తీసుకున్న నిర్ణయం గల్ఫ్ వలస కార్మికుల సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగిత్యాల్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన రవిగౌడ్ గల్ఫ్కు వలస వెళ్లి అక్కడ మన కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలను చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులకు రవిగౌడ్ అండగా ఉండటంతో ఆయనను జేఏసీ చైర్మన్గా ఎంపిక చేశారు. అడ్వయిజరీ బోర్డు నామమాత్రంగానే ఉందనే అభిప్రాయం కొన్ని నెలల నుంచి వలస కార్మికుల సంఘాల్లో చక్కర్లు కొడుతోంది.
రెండేళ్ల కాలపరిమితిలో ప్రవాసీ విధానం రూపకల్పన కోసం అడ్వయిజరీ బోర్డు నివేదిక అందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ సరైన కార్యాచరణ లేకపోవడంతో ప్రవాసీ విధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


