60వ పెళ్లి రోజునే మాజీ మంత్రికి సతీ వియోగం | - | Sakshi
Sakshi News home page

60వ పెళ్లి రోజునే మాజీ మంత్రికి సతీ వియోగం

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

అనారోగ్యంతో శనిగరం

సంతోష్‌రెడ్డి సతీమణి మృతి

హైదరాబాద్‌కు తరలివెళ్లిన అభిమానులు

27న అంత్యక్రియలు

ఆర్మూర్‌/కమ్మర్‌పల్లి : ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డికి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి శనిగరం విజయరెడ్డి (80) హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గల నివాసంలో అనారోగ్యంతో డయాలసిస్‌ చికిత్స పొందుతున్నారు. కాగా, సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శనిగరం సంతోష్‌రెడ్డి, విజయరెడ్డిల 60వ పెళ్లి రోజునే ఆమె మరణించడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌కు చెందిన సంతోష్‌రెడ్డికి ఆర్మూర్‌ మండలం కల్లెడకు చెందిన విజయరెడ్డితో 1966 మే 25వ తేదీన వివాహం జరిగింది. వారికి కూతురు మాధవి రెడ్డి (బోధన్‌కు చెందిన కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి సతీమణి), కుమారుడు శనిగరం శ్రీనివాస్‌రెడ్డి(వాసుబాబు) ఉన్నారు. మనవడు ఆర్మమన్‌ అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఈ నెల 27న అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రికి సతీవియోగం కలగడంతో మంత్రి శ్రీధర్‌బాబు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అనుచరులు వెంకట్రామ్‌రెడ్డి, మారుతిరెడ్డి, వెంకట గిరి హైదరాబాద్‌కు తరలివెల్లి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement