నిజామాబాద్ రూరల్: పార్లమెంట్లో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లునే అమలు చేయాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టడంపైనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ఒక అసత్య దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తోందని తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు 2023లోనే ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. ఇటీవల లోక్సభలో విఫలమైంది రిజర్వేషన్ల ముసుగులో దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల స్థానాల సంఖ్యను పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి చేసిన ప్రయత్నమే అని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో ఉన్న స్థానాల సంఖ్య ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడానికి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు. నగర కార్పొరేషన్ డీసీసీ కార్యదర్శులు ఉప్పరి స్వప్న, మడుపు స్వప్న, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, మాజీ కార్పొరేటర్ మురళి, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, హమాల్వాడి సంతోషీ మాత సాయిబాబా గుడి చైర్మన్ గంగాకిషన్, నాయకులు అష్రఫ్ ఉన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్కు
ముడిపెట్టడం సరికాదు
కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు
బొబ్బిలి రామకృష్ణ


