నిజామాబాద్ అర్బన్: జిల్లా పోలీస్ శాఖలో అదనపు డీసీపీగా పనిచేస్తున్న బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో వరంగల్ ఏఎస్పీగా పనిచేస్తున్న శుభం ప్రకాశ్ను అదనపు డీసీపీ(అడ్మిన్)గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా బస్వారెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
బాలుడి హత్య కేసులో
తల్లి, ప్రియుడి అరెస్ట్
కామారెడ్డి క్రై మ్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడి దారుణ హత్యకు పాల్పడిన తల్లి, ఆమె ప్రియుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్వో నరహరి వివరాలు వెల్లడించారు. రాజంపేట మండలానికి చెందిన రజిత అలియాస్ లక్ష్మి తన భర్తతో గొడవపడి ఆరు నెలలుగా కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు కుమార్తె, కుమారుడు శ్రావణ్ (05) ఉన్నారు. లక్ష్మీనరసింహులు అనే వ్యక్తితో లక్ష్మి కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి శ్రావణ్ హత్యకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నారు. శుక్రవారం లక్ష్మి కూలీ పనులకు బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మీనరసింహులు శ్రావాణ్ గొంతు పిసికి, నేలకేసి బాది దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన తల్లి, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.
ఎల్లారెడ్డి: ఎస్ఐఆర్పై పోలింగ్కేంద్రాల వారిగా ఓటర్లకు అవగాహన కల్పించాలని ముస్లిం వెల్ఫేర్ నాయకులు శనివారం ఆర్డీవో ప్రభాకర్కు వినతిపత్రం అందించారు. బీఎల్వోలను నియమించి వారికి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలని అన్నారు. 2002 కంటే ముందు ఉన్న ఓటరు లిస్టు ఆధారంగా సర్వే నిర్వహించాలన్నారు.


