బాన్సువాడ రూరల్: మండలంలోని చిన్న రాంపూర్లో ఎర్రోల్ల గంగారాంకు చెందిన పెంకుటిల్లు శనివారం తెల్లవారుజామున దగ్ధమైంది. అంతకుముందు రోజు రాత్రి అతడు కట్టెల పొయ్యిపై వంట చేసిన అనంతరం మంటలను సరిగా ఆర్పలేదని, దీంతో మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైందని సమాచారం. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఇంట్లోని సామగ్రి, దుస్తులు, పత్రాలు అన్ని అప్పటికే కాలిబూడిదయ్యాయి. గ్రామంలో అత్యంత నిరుపేద అయిన గంగారం ఒంటరిగా జీవిస్తున్నాడని ప్రభుత్వం అతడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు.
దోమకొండలో..
దోమకొండ: మండల కేంద్రంలోని ముత్యంపేట రోడ్డులో శనివారం ఛత్తీస్గడ్కు చెందిన కూలీలు తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులో సిలిండర్ పేలి, మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోజు మాదిరిగా సదరు కూలీలు కట్టెల పోయ్యిపై వంట చేసుకుని పనికి వెళ్లారు. ఎండ వేడిమికి కట్టెల పొయ్యిలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్కు మంటలు అంటుకోగా అది పేలింది. దీంతో కాలనీవాసులు తీవ్రంగా భయపడ్డారు. దగ్గరలోని బోరు నుంచి నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలు చేలరేగి సిలిండర్ పేలిన సమయంలో తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని కాలనీవాసులు తెలిపారు.


