సుభాష్నగర్: జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో శుక్రవారం జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి పరమేశ్వర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రుల్లోని సిబ్బందికి, ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నందిపేట్, భీంగల్ తదితర కేంద్రాల పరిధిలోగల ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఎలా స్పందించాలి, రోగులను ఎలా ఖాళీ చేయించాలి, తదితర అంశాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ‘అగ్ని ప్రమాదాల నివారణ కోసం, సురక్షిత పాఠశాల, సురక్షితమైన ఆస్పత్రి, అగ్ని భద్రతపై అవగాహన కలిగిన సమాజం అవసరం’ అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నట్లు పరమేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.


