మాక్లూర్: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హాజరు కాగా, రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. మాక్లూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గత ఎమ్మెల్యే హయాంలో ఎంత కబ్జా చేయాలో అంత చేశారని ఆరోపించారు. అక్కడక్కడ మిగిలి ఉన్న ప్రభుత్వ భూములు, గుట్టలను ఇక్కడి రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు అంటగడుతున్నారని ఆరోపించారు. మండల పరిధిలోని రెండు వెంచర్లలో ప్రభుత్వ భూములలను విలీనం చేసుకున్నారన్నారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ కోరినా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కృతిమ ఇసుక పరిశ్రమలు, అక్రమ మొరం, ఇసుక దందా నడుస్తున్నా అధికారులు పట్టుకోవడం లేదన్నారు. ఆర్ఐ బదిలీ అయి 2 నెలలు కావస్తున్న ఇంకా రిలీవ్ ఎందుకు ఇవ్వటం లేదు. ఇందులో ఇద్దరి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు. అధికారుల తీరును ఎండగట్టిన అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఎంపీడీవో బ్రహ్మనందం, తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ షపీ తదితరులు పాల్గొన్నారు.


