● సీపీ సాయిచైతన్య
● సర్పంచులు, కార్పొరేటర్లకు
అరైవ్–అలైవ్పై అవగాహన
నిజామాబాద్అర్బన్: జిల్లాలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరిస్తే ఐపీఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తామని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్లో సర్పంచులు, కార్పొరేటర్లకు మన ఊరు మన భద్రత, అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వ్యవసాయదారులు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబై ల్ ఫోన్లు వాడకం నిషేధమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగ్గినంత దూరం ఉండేలా చూడాలన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ గమనించాలని, ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబసభ్యులు మాట్లాడారు. వారి ఆవేదన, ఇబ్బందులను వివరించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన మాక్లూర్ మండలానికి చెందిన వ్యక్తిది నిరుపేద కుటుంబం కావడంతో వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, సమావేశంలో జమ చేసిన డబ్బులను సీపీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిన్న సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


