వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామానికి చెందిన సువర్ణ (23) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కొంతకాలంగా వీరి కుటుంబం సత్యనారాయణపురంలో నివసిస్తోందని, కుటుంబకారణాలతో సువర్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
పిట్లం(జుక్కల్): మతిస్థిమితంలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లంకు చెందిన గొల్ల శ్రీనివాస్ (30) కొంతకాలంగా మతిస్థిమితంలేక హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు ఇంట్లోంచి వెళ్లగా, 11 గంటలకు శ్రీనివాస్ పెద్ద చెరువులోకి వెళ్లడాన్ని గమనించిన గ్రామానికి చెందిన గొల్ల సాయిలు తండ్రి బాగాయ్యకు ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే వారు అక్కకి వెళ్లి చూడగా చెరువు ఒడ్డుపై చెప్పులు కనిపించాయి. జాలర్లను పిలిపించి వెతికించగా ఒడ్డుకు కొద్దిదూరంలో శ్రీనివాస్ మృతదేహం లభించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


