నిజామాబాద్అర్బన్ : పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపడుతున్నామని తెలిపారు.
మీ సేవ కేంద్రంలో
ఏసీబీ తనిఖీలు
నిజామాబాద్అర్బన్: నగరంలోని శివాజీ చౌక్లో సాయికృపా ఆన్లైన్ మీసేవ కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కేంద్రాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దరఖాస్తుదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేయడం, మధ్యవర్తులు, ఏజెంట్ల ద్వారా అక్రమ లావాదేవీలు, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ల జారీ తదితర ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపడుతున్నారు.
కీటక జనిత వ్యాధుల
నియంత్రణకు కృషి చేయాలి
సుభాష్నగర్: కీటక జనిత వ్యాధుల నియంత్రణకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ బి రాజశ్రీ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం నుంచి మే 15వ తేదీవరకు కీటక జనిత వ్యాధుల నియంత్రణ, వడదెబ్బ నియంత్రణ, టీబీ ముక్త్ భారత్పై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణలో పని చేసే సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. 30 రోజుల కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజూ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమీక్షలో డీఎంవో వినయ్కుమార్, ఏఎంవో షేక్ సలీం, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్నగర్: నగరంలోని వినాయక్నగర్ డీ–4 సెక్షన్ పరిధిలో 11 కేవీ లైన్ల కింద చెట్ల కొమ్మలు నరికివేత కారణంగా శుక్రవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాందేవ్ సూపర్మార్కెట్ ఏరియా, దుర్గామాత టెంపుల్ ప్రాంతం, గణపతుల బావి కాలనీ, రిలయన్స్ మాల్ ఏరియా, వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్, తొలి మేయర్ కమాన్ ఏరియా, ఐదు చేతుల పోచమ్మ గుడి ప్రాంతం, యాదగిరి బాగ్, హనుమాన్ నగర్, పద్మానగర్ రోడ్ నెంబర్ 1 నుంచి 4 వరకు, రైతుబజార్ బ్యాక్ సైడ్, మైసమ్మగల్లి, చైతన్య స్కూల్ ఎదురుగల్లి, పాటిగల్లి, బజరంగ్ కాలనీ, చింతచెట్టు మైసమ్మ కమాన్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వినోద్ కోరారు.


