నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెందిన కోట గంగామణి(26) జీవితంపై విరక్తితో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. నిజామాబాద్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి చెందిన సాయిలుతో ఏడేళ్ల కిందట వివాహం జరగ్గా, ముగ్గురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట భర్త సాయిలు అనారోగ్యంతో మృతి చెందగా జన్నెపల్లిలోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. జీవితంపై విరక్తితో మంగళవారం సాయంత్రం యంచ శివారులోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలోని బాపూజీనగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. చందు, కమలేశ్ అనే వ్యక్తులు బాపూజీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బుధవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు విటులను పట్టుకొని, వారి నుంచి రూ. 2,450 నగదుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
రామారెడ్డి: మండలంలోని జగదాంబ తండా చౌరస్తాలో బుధవారం ఉదయం పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్నారు. మండలానికి చెందిన జూలూరి శ్రీ చరణ్, దుద్దెల్లా రమేశ్ రెండు వాహనాల్లో 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి రెవెన్యూ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


