ఖలీల్వాడి: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే దేశంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆలిండియా సర్వీసెస్ను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగానని గుర్తు చేశారు. అంబేడ్కర్ 135వ జయంతిని జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, నగర మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణకు కషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ అక్కడ ఉన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆ మహనీయుని స్ఫూర్తి తో విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసం చే యాల ని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ.లక్షా ఎనిమిది వేల చొప్పున నిధులను ఖర్చు చేస్తోందని తెలిపారు. రాజ్యాంగం ఆధారంగానే అధికార యంత్రాంగం ప్రభు త్వ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. నిజామాబాద్ నగరంలో అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అందరితో చర్చించి జిల్లా యంత్రాంగం సముచిత నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మేయర్ కే.ఉమారాణి మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించిందని, ఆయన ఆశయ సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు నగదు పారితోషికంతోపాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
ప్రతి ఒక్కరూ అంబేడ్కర్
ఆశయ సాధనకు కృషి చేయాలి
విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలి
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి


