క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

గాయపడిన వ్యక్తి .. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు..

ఈతకు వెళ్లి ఒకరి మృతి

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌ చెరువులో ఈతకు వెళ్లి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. బిచ్కుంద గ్రామానికి చెందిన సంజీవ్‌(37), కమ్మరి రేఖ దంపతులు. ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని ఆనంద్‌నగర్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా ప ని చేస్తున్నాడు. సంజీవ్‌కు కల్లు తాగే అలవాటు ఉంది. ఆదివారం సాయంత్రం న్యాల్‌కల్‌లో కల్లు తాగేందుకు తన కొడుకు లక్ష్మణ్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు. కల్లు తాగిన తర్వాత సంజీవ్‌లో చెరువులోకి ఈత కోసం దిగి నీటమునిగాడు. ఈ విషయాన్ని కొడుకు లక్ష్మణ్‌ తల్లి రేఖకు తెలపగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భార్య రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.

బాన్సువాడ: కాలినగాయాలతో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందినట్లు సీఐ శ్రీధర్‌ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ యూసుఫ్‌(40) మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో నుంచి వెళ్లి ఐదారు రోజులైన తిరిగి వెళ్లేవాడు కాదు. ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిన యూసుఫ్‌ తిరిగి ఇంటికి రాలేదు. 8న బాన్సువాడలోని ఓ షాపింగ్‌ మాల్‌ పక్కన తనకు తాను పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించగా, సోమవారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య పర్వీన్‌ సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

ఇందల్వాయి: జాతీయ రహదారి 44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇందల్వాయి ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌కు చెందిన సయ్యద్‌ అహ్మద్‌(41) కొంతకాలంగా కుటుంబంతో కలిసి ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సయ్యద్‌ అహ్మద్‌ తన కొడుకు ఇస్మాయిల్‌తో కలిసి మండల కేంద్రంలో అన్నం అడుక్కునేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా రహదారి దాటే క్రమంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ అహ్మద్‌ మృతి చెందాడు. మృతుడి భార్య గౌసియా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement