భిక్కనూరు: మండల కేంద్రంలో వృద్ధురాలిపై దాడి చేసిన కేసులో నిందితుడిని మూడు గంటల్లోనే భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారని ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. సోమవారం భిక్కనూరులో విలేకరుల సమావేశంలో ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉప్పరి లచ్చవ్వ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె తలపై రోకలి బండతో దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులు వెంటనే స్పందించి నిందితుడి కోసం గాలించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మండల కేంద్రంలోని చర్చి ప్రాంతంలో నిందితుడు, మండలకేంద్రానికి చెందిన గజ్జె స్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్దనుంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, తులం బంగారు గుండ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. బంగారం ధర భారీగా పెరిగినందున మహిళలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.


