● బంగారం, వెండి, నగదు అపహరణ
నస్రుల్లాబాద్: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గడిగళ్ల రాములు, గైని లచ్చవ్వ, మేత్రి సాయిలు, ప్రసాద్, అప్పాజి ఇళ్లకు తాళ వేసి ఉండటంతో దుండగులు దొంగతనం చేశారు. రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, సుమారు రూ.70 వేల నగదు అపహరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై రాఘవేంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు సోమవారం వేకువజామున అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, డీఎస్పీ శేఖర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని నిలిపివేసి తనిఖీ చేయగా అందులో 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతోపాటు డ్రైవర్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో కేసు నమోదు చేసుకొని బియ్యంను జంగంపల్లిలోని ప్రభుత్వ గోదాముకు తరలించారు.


