ముధోల్: మండలంలోని కారేగాం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేశారు. అయితే విక్రయించిన మొక్కజొన్న సంచులను అధికారులు గోదాములకు తరలించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయి. దీంతో మొక్కజొన్న తరలించాలని భైంసా–బాసర రహదారిపై సోమవారం గంటపాటు రైతులు రాస్తారోకో చేశారు. ఎస్సై బిట్లా పెర్సిస్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. తమకు అధికారులు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పీఏసీఎస్ సీఈవో భూమయ్య, మార్క్ఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడించినా ఆందోళన విరమించలేదు. తహసీల్దార్ శ్రీలత వచ్చి లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో సర్పంచ్ మోత్రే నారాయణ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత కై రి సాయి మోహన్ పాల్గొన్నారు.


