నేను చనిపోయేలోపైనా పాస్బుక్ ఇవ్వండి
నిర్మల్టౌన్: ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నారని, వారి వినతులపై అధికారులు సానుకూల దృక్పథంతో స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు.
విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్యా వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు చురుకుగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 15న నిర్వహించనున్న ‘లైబ్రరీ డే’ సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున పుస్తకాలను వితరణ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాది భైంసా మండలం సుంకుల్లి గ్రామం. 20 ఏళ్ల క్రితం ఎస్పారెస్పీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయాం. అప్పటి అధికారులు మా సొంత గ్రామమైన లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీలో సర్వే నంబర్ 396/5లో ఐదు ఎకరాలు డీవన్ పట్టాగా మాకు ఇచ్చారు. కానీ ఇప్పటికీ పట్టా పాస్బుక్ ఇవ్వలేదు. దీంతో ఆ భూమి సాగుచేసుకోకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. పట్టా పాస్ పుస్తకం 20 ఏళ్లుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న. నా వయసు 80 ఏళ్లు.. నేను చనిపోయే లోపైనా పట్టా పాస్బుక్ ఇప్పించండి
– బూరుగుపల్లి సాయన్న, కొడుకు మురళి


