నిర్మల్టౌన్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించవద్దని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే విత్తనాలు నాణ్యమైనవన్నారు. ధర తక్కువగా ఉండడంతో పాటు దిగుబడి కూడా అధికంగా ఉంటుందన్నారు. అనుమతులు లేని ప్రైవేట్ విత్తన కంపెనీలు రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నాయన్నారు. సహకార, మహిళా సంఘాలు విత్తన సంస్థ యొక్క విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ తయారుచేసే విత్తనాలు నాణ్యత పరీక్షల తర్వాత విపణిలోకి వస్తాయన్నారు. ఈ విత్తనాలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందుతారన్నారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు వినియోగించేలా డీలర్లు ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు అంజిప్రసాద్, శ్రీధర్, డీఆర్డీవో విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీమ్రెడ్డి, అబ్దుల్ హాది, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, ఇతర అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.


