బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సోమవారం డిజిటల్ తరగతి గదులు ప్రారంభించారు. స్మార్ట్ బోధనా వనరులు, హైక్వాలిటీ ఆడియో విజువల్ వ్యవస్థ, సమగ్ర డిజిటల్ మౌలిక వసతులతో తరగతి గదులను రూపొందించారు. ఒకేసారి సుమారు 300 మంది విద్యార్థులు లైవ్ తరగతుల్లో పాల్గొనే విధంగా వీటిని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు తీసుకురావడం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో భాగంగా బోధన, బోధనేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధి, సాంకేతిక ఆధారిత విద్యా విధానాల అమలు, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పన దిశగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


