బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. రూ.225 కోట్లతో రూపొందించిన మాస్టర్ప్లాన్ అమలుపై రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు ఆదివారం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేశ్ మిశ్రా ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మీ ఆలయం, వ్యాసగుహ, భక్తుల వసతి సముదాయాలను పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రపంచస్థాయి సదుపాయాలు, పార్కింగ్, క్యూలైన్లు, తాగునీరు, వసతి తదితర వసతులు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వారి వెంట సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, బాసర ఎస్హెచ్వో, సీఐ కిరణ్, ఇంజినీరింగ్ అధికారులున్నారు.


