భైంసా/కుంటాల/లోకేశ్వరం: భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో, కుంటాల మండలం కల్లూరు, అందకూర్, పెంచికల్పాడ్, వెంకూర్, అంబకంటి, ఓల, కుంటాల గ్రామాల్లో , లోకేశ్వరం మండలం పుస్పూర్, రాయాపూర్కాండ్లీ, సాథ్గాం, హథ్గాం, హవర్గ, ధర్మోర, పంచగుడి తదిరత గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. వెంకూర్ – అందకూర్ గ్రామాల మధ్య రోడ్డుపై సుమారు 20 చెట్లకు పైగా విరిగి పడ్డాయి. ఎస్సై అశోక్ యువకుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కాండాలు, కొమ్మలను తొలగించారు. ఆకస్మికంగా కురిసిన వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే కోతలు, రవాణా, కూలీల ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో గ్రామాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.


