లక్ష్మణచాంద: పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితా లపై ఉత్కంఠ ఉంటుంది. బాగా రాసినవారు ఉత్సాహంగా కనిపిస్తారు. సరిగా రాయనివారు టెన్షన్ పడతారు. నిరక్షరాస్యత నిర్మూలతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఉల్లాస్’(అమ్మకు అక్షరమాల). గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అక్షర జ్ఞానాన్ని అందించడానికి వంద రోజులు ప్రత్యేక రాత్రి బడులను నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న మహిళల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మార్చి 29న రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించారు. 38 రోజులు గడుస్తున్నా ఫలితాలు విడుదల చేయలేదు. దీంతో ఉల్లాస్ అభ్యర్థుల్లో ఉత్సాహం ఆవిరవుతోంది.
మూల్యాంకనం పూర్తి..
నిర్మల్ జిల్లాలో ఈ పరీక్ష కోసం మొత్తం 18,339 మంది మహిళలు నమోదు చేసుకోగా, అందులో 17,824 మంది హాజరయ్యారు. జిల్లాలోని మండలాల వారీగా సెర్ఫ్ అధికారులు, ఉపాధ్యాయులు మరియు సీఆర్పీల పర్యవేక్షణలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ పత్రాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపగా, అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, తదనంతరం రాష్ట్ర, కేంద్ర విద్యాశాఖలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
ఫలితాల కోసం నిరీక్షణ..
అక్షరాలు నేర్చుకుని పరీక్ష రాసిన మహిళల్లో తమ ఫ లితాల కోసం ఉత్సాహంగా చూస్తున్నారు. అయితే, పరీక్ష ముగిసిన నెల రోజులకు పైగా సమయం గడిచినా ఫలితాల కోసం వేచిచూడాల్సి రావడం విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేంద్రస్థాయి నుంచి ఫలితాలు వెలువడాల్సి ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు మాత్రం తమ శ్రమకు తగ్గ గుర్తింపు ఎప్పుడు లభిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. సాక్షరత దిశగా అడుగులు వేసిన ఈ మహిళల్లో ఉత్సాహాన్ని కాపాడాలంటే, ప్రభుత్వం త్వరగా ఫలితాలను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.


