భైంసారూరల్/తానూరు: మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని మక్కరైతులు గురువారం రోడ్డెక్కారు. కొనుగోళ్లలో జాప్యం, తేమ శాతం పేరుతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా మండలం మాటేగాంలో జాతీయ రహదారిపై, తానూరులో బెల్తరోడా–తానూరు రహదారిపై ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సుప్రియ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరి పారు. అకాల వర్షాల కురుస్తున్నాయని, వెంటనే కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలకు తెచ్చి వారం రోజులు గడుస్తున్న అధికారులు గన్నీ సంచులు ఇవ్వడం లేదని, లారీలు రావడం లేదని కొనుగోలు చేయడం లేదన్నారు. ఆందోళన కారణంగా గంటపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. తహసీల్దార్లు శశిభూషణ్, మహేంద్రనాథ్ రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోళ్లు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


