అభిలాష అభినవ్‌కు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

అభిలాష అభినవ్‌కు వీడ్కోలు

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

● పాత కలెక్టర్‌ అధికారుల సన్మానం

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ కలెక్టర్‌గా విశేష సేవలందించి బదిలీపై వెళ్తున్న అభిలాష అభినవ్‌కు బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. కలెక్టర్‌గా అభిలాష అభినవ్‌ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన నుంచి పరిపాలనలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ప్ర జాసమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నా రు. విపత్తుల సమయంలో సమర్థవంతమైన చర్యలు చేపట్టడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిపారని అధికారులు గుర్తు చేసుకున్నారు. అనంతరం అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లాలో పనిచేయడం తనకు ఒక మధురమైన అనుభవమని ఆమె తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రతీ అధికారి, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. టీమ్‌వర్క్‌తోనే లక్ష్యాలను సాధించగలిగామని తెలిపా రు. నిర్మల్‌ జిల్లా ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుంటాయని పేర్కొన్నారు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అధికారులు ఆమెను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ సంకేత్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement