నిర్మల్చైన్గేట్: కిడ్నీ సంబంధిత వ్యాధి బాధితులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డయాలెసిస్ కేంద్రాలలో పడకల సంఖ్య పెంచింది. నర్సాపూర్(జి) సామాజిక ఆరోగ్య కేంద్రానికి డయాలసిస్ సెంటర్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న సేవలు సరిపోక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నవారికి ఇది ఊరటనివ్వనున్నాయి.
25 కిలోమీటర్లకు ఒక కేంద్రం..
ప్రతీ 25 కిలోమీటర్ల దూరానికి ఒక డయాలెసిస్ కేంద్రం ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్ర ణాళికలో భాగంగా జిల్లాకు నూతన కేంద్రం మంజూరైంది. నర్సాపూర్(జి) ఆసుపత్రిలో ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనునాన రు. మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆస్సత్రిలో గది కేటాయించి, అందులో ఐదు యంత్రాలతో ఐదు పడకల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతోపాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి. చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి, భైంసా ఏరి యా ఆసుపత్రుల్లో ఉన్న పడకల సంఖ్య కూడా పెంచి మరింత మందికి అవకాశం కల్పించనున్నారు.
జిల్లాలో 140 మందికి సేవలు
ప్రస్తుతం జిల్లాలో మూడు ప్రభుత్వ డయాలెసిస్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జనరల్ ఆస్పత్రిలో 10 మిషన్లు, ఖానాపూర్ ఆస్పత్రిలో 5, బైంసా ఏరియా ఆసుపత్రిలో 5 మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 140 మంది కిడ్నీ బాధితులకు డయాలెసిస్ సేవలు అందిస్తున్నాయి. కొత్త కేంద్రాలు ప్రారంభమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగి, ప్రయాణ సమయం, ఖర్చు తగ్గి, మరింత మందికి సేవలు ఉచితంగా అందుతాయి.
నిర్మల్ జనరల్ ఆస్పత్రి
సెంటర్ ప్రారంభం 2018
పడకలు 10
షిఫ్ట్లు 04
ప్రతీరోజు షెషన్లు 30–35
మొత్తం పేషెంట్లు 78
ఖానాపూర్..
సెంటర్ ప్రారంభం 2023
షిఫ్టులు 03
పడకలు 05
ప్రతీరోజు షెషన్లు 8–10
మొత్తం పేషెంట్లు 24
భైంసా..
షిఫ్టులు 03
పడకలు 05
ప్రతీరోజు షెషన్లు 12–15
మొత్తం పేషెంట్లు 38
ప్రభుత్వానికి నివేదిక..
జిల్లాకు కొత్తగా డయాలసిస్ కేంద్రంతోపాటు జనరల్ ఆస్పత్రికి, బైంసా ఏరియా ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆనువైన స్థలం, విద్యుత్, నీటి వసతులను పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తెస్తాం.
– డాక్టర్ కాశీనాథ్, డీసీహెచ్ఎస్


