నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీ కోఆప్షన్ పదవుల ఎంపిక పూర్తయింది. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 42 వార్డుల్లో 24 స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. 13 వార్డుల్లో బీజేపీ, మూడింటిలో ఎంఐఎం, రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఉండడంతో కోఆప్షన్ పదవులన్నీ ఆ పార్టీకి చెందినవారికే దక్కాయి.
బరిలో 42 మంది
నిర్మల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. జనరల్ పురుషుల విభాగంలో 11 మంది, మహిళలు ఏడుగురు బరిలో ఉండగా, మైనార్టీ పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో 8 మంది పోటీలో నిలిచారు. ఎవరి ప్రయత్నాలు వారే చేసుకున్నారు.
ఉత్కంఠకు తెర
పోటీ ఎక్కువగా ఉండడంతో సభ్యుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మద్దతుతో బీసీ వర్గం నుంచి మేడారం అపర్ణ, మైనార్టీవర్గం నుంచి ఆస్మాబేగం, నోమన్ అలీ, జనరల్ విభాగం నుంచి గాజుల రవికుమార్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న సభ్యుల కు మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, డీఈ హరిభువన్, మేనేజర్ మారుతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మేడారం అపర్ణ
ఆస్మా బేగం
గాజుల రవికుమార్
నోమన్ అలీ


