ఖానాపూర్: పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పల్లికొండ జనార్దన్ చేస్తున్న సేవ ప్రత్యేకమైనది. పదేళ్లుగా ప్రతీ వేసవిలో మూడునెలలపాటు ప్రతీరోజు వెయ్యికి పైగా మందికి ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన సబ్–రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేఖరిగా పనిచేసే జనార్దన్, తన సంపాదనలో కొంత భాగాన్ని ఈ సేవలకే వినియోగిస్తున్నారు. అదనంగా సుమారు రూ.50 వేలు వెచ్చించి ఏర్పాటుచేసిన కూల్వాటర్ ఫ్రీజర్ ద్వారా రోజంతా చల్లని శుద్ధ నీరు అందిస్తున్నారు. బస్టాండ్ వద్ద రద్దీ పెరిగినా, ఆయన సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రజలు అక్కడికి తరలివచ్చి అంబలి తాగి, అవసరమైతే బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్తున్నారు. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సురేశ్ ద్వారా స్థానిక రైతుల నుంచి మంచి నాణ్యత జొన్నలు కొనుగోలు చేసి రుచికరమైన అంబలి తయారు చేసి అందిస్తున్నారు.


