మైనారిటీ ఓట్లతోనే కాంగ్రెస్ గెలుపు
నిర్మల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మైనారిటీ ఓటుబ్యాంకుతోనే గెలుపొందిందని, నిర్మల్లో నైతిక విజయం బీజేపీదేనని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎన్నికల్లో గెలుపొందిన 13 మంది కౌన్సిలర్లను శనివారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒక్కరే కౌన్సిలర్ గెలిచారని, ఈసారి సంఖ్య 13కు చేరుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మున్సిపల్పై కాషాయజెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.
తక్కువ తేడాతోనే..
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందని మహేశ్వర్రెడ్డి విమర్శించారు. సూడో సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటై బీజేపీ గెలుపును అడ్డుకున్నాయాని ఆరోపించారు. నిర్మల్లో కాంగ్రెస్ 27 వేల ఓట్లు సాధిస్తే, బీజేపీ 20,335 ఓట్లు సాధించిందన్నారు. తక్కువ తేడాతోనే ఓడిపోయామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యంరెడ్డి, శనిగరపు చిన్నయ్య, నారాయణరెడ్డి, కూన శివకుమార్, సాదం అరవింద్, నూతన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


