
పొదుపు మహిళలకు అక్షర జ్ఞానం
● ‘ఉల్లాస్’తో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పథకం అమలు ● నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీవో సిబ్బంది
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం మహిళా సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని ప్రతీ మహిళ అక్షర జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. దశలవారీగా అమలయ్యే ఈ పథకం ద్వారా నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడం నేర్పడంతోపాటు, మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
డీఆర్డీవో, విద్యాశాఖ సమన్వయం
ఉల్లాస్ కార్యక్రమం సజావుగా అమలు కావడానికి డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుంది. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఐకేపీ ఏపీఎం, గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, వీఏవో, సంఘాల అధ్యక్షురాళ్లు, కార్యదర్శులు బాధ్యతలు నిర్వహిస్తారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సర్వే వివరాలను ఈ యాప్లో నమోదు చేస్తారు. చదువు మధ్యలో మానేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివేలా ప్రోత్సహిస్తారు. సంఘాల్లో చదువుకునేవారు లేకుంటే సభ్యు ల పిల్లలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సర్వే పూర్తయిన వెంటనే వాలంటీర్ల సాయంతో కార్యక్రమం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సామాజిక సాధికారత
ఉల్లాస్ పథకం ద్వారా చదవడం, రాయడం నేర్ప డం ద్వారా సామాజిక సాధికారత సాధించడమే ప్రధాన లక్ష్యం. అధికారిక సమాచారం ప్రకారం, మహిళా సంఘాల్లో 50 శాతం మంది మాత్రమే సంతకం చేయగలరు, మిగిలిన వారు వేలిముద్రలు వే స్తున్నారు. ఈ పథకం ద్వారా అందరికీ చదవడం, రాయడం నేర్పడంతోపాటు, మధ్యలో చదువు మా నేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, డిగ్రీ వరకు చదివించనున్నారు. అదనంగా, స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బ్యాంకింగ్లో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు.
వలంటీర్లుగా అక్షరాస్యులు
డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించిన తర్వాత, 15–20 మందితో గ్రూపులను ఏర్పా టు చేస్తారు. మహిళా సంఘాల్లోని అక్షరాస్య మహిళలను వలంటీర్లుగా ఎంపిక చేసి, నిరక్షరాస్యులకు చదువు నేర్పే బాధ్యత అప్పగిస్తారు. వీరు ఎలాంటి పారితోషికం లేకుండా సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యాశాఖ నుంచి పుస్తకాలు, గ్రామస్థాయి ఉపాధ్యాయుల సహకారంతో ఈ పథకం విజయవంతం కానుంది.
జిల్లా వివరాలు
మండలాలు 18
18 ఏళ్లు నిండిన సభ్యులపై దృష్టి
ఈ పథకం ప్రధానంగా 18 ఏళ్లు నిండిన మహిళా సంఘ సభ్యులపై దృష్టి సారిస్తుంది. జిల్లా స్థాయిలో డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే ప్రారంభించారు. ఇప్పటి వరకు 31,323 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించారు. సంఘాల్లో అక్షరాస్యులైన సభ్యులను వాలంటీర్లుగా నియమించి, నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం నేర్పిస్తారు. ఐదుగురు నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు. గ్రామ స్థాయిలో సర్వే పూర్తి చేసి, నిరక్షరాస్యుల సంఖ్యను ఖరారు చేస్తారు.
అవగాహన కల్పిస్తున్నాం..
2030 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అక్షరాస్యత సాధించే దిశగా ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మహిళా సంఘంలోని నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యాశాఖ అధికారులు, డీఆర్డీవో ఆధ్వర్యంలో సమష్టిగా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటాం.
– తిరుపతిరావు, సహాయ ప్రాజెక్టు అధికారి