● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్చైన్గేట్: జిల్లాలో వర్షాలు, వరదల వల్ల ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లడ్ మాన్యువల్పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణ కేవలం స్పందనకే పరిమితం కాకుండా, ప్రమాద నివారణ, తీవ్రత తగ్గింపు, పునరావాసం, పునర్నిర్మాణం దశల్లో ముందస్తుగా ప్రణాళికలు ఉండాలన్నారు. వర్షాకాలానికి ముందు నదులు, వాగులు, కుంటలలో నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయాలని, పట్టణాల్లో డ్రెయినేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని, పాడైన రహదారులను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. రిజర్వాయర్ల గేట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు, గోదావరి పరీవాహక గ్రామాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుల నీటిమట్టాలను నిరంతరం గమనిస్తూ దిగువ గ్రామాలకు సమాచారం అందించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జిలు, రహదారులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. వైద్యులు, సిబ్బంది స్థాని కంగా అందుబాటులో ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో పశువులను మేతకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం మండలాల వారీగా వరద ప్రభావిత ప్రాంతాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఆర్డీవో రత్నాకళ్యాణి, రెవెన్యూ, విద్యుత్, ఫైర్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులకు బాసటగా రైతు భరోసా
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతులకు బాసటగా నిలుస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి జిల్లాలో 1,86,400 మంది రైతులకుగానూ మంగళవారం నాటికి డీబీటీ ద్వారా 1,33,135 మందికి రూ.112.86 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులు జమ కాబోతున్నట్లు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా పెట్టుబడి సాయం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు.